సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు కాస్తంత పెరిగాయి. ఇటీవల తుపాను కారణంగా రాష్ట్రంపై ఇంకా మేఘాలు ఆవరించి ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు, రాత్రి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్లలో 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్, హన్మకొండ, భద్రాచలం, నల్లగొండ, రామగుండంలలో 31 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 10 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదుకావడం గమనార్హం. హైదరాబాద్లో 20 డిగ్రీలు, నల్లగొండలో 23 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.