పది ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు శూన్యం

11 Aug, 2015 02:06 IST|Sakshi
పది ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు శూన్యం

♦  110 ఇంజనీరింగ్ కాలేజీల్లో 50లోపే విద్యార్థులు
♦  15 మందిలోపు విద్యార్థులు చేరినవి 56 కాలేజీలు
♦  25 మందిలోపు విద్యార్థులు చేరినవి 79 కాలేజీలు
♦  100 మందిలోపు విద్యార్థులు చేరినవి 160 కాలేజీలు
♦  91 కాలేజీల్లో పూర్తిగా సీట్లు భర్తీ
♦  కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ ప్రవేశాల తీరిది

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.

ఐదులోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య 21. పది మందిలోపే విద్యార్థులు చేరిన కళాశాలలు 42. ఇక 56 కాలేజీల్లోనైతే 15 మందిలోపే విద్యార్థులు చేరారు. ఇదీ ఇటీవల చేపట్టిన ఇంజనీరింగ్‌లో కన్వీనర్ కోటా ప్రవేశాల తీరు. 79 కాలేజీల్లో 25 మందిలోపే విద్యార్థులు చేరగా, 110 కాలేజీల్లో 50 మందిలోపే చేరారు. 160 కాలేజీల్లో 100 మందిలోపే చేరినట్లు సాంకేతిక విద్యాశాఖ లెక్కలు వేసింది. మొత్తానికి 91 కాలేజీల్లో మాత్రమే కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు లెక్కతేల్చారు.
 
110 కళాశాలల భవితవ్యం అగమ్యగోచరం
రాష్ట్రంలో జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, అనుబంధ గుర్తింపు ఇవ్వకపోయినా కోర్టు నుంచి అనుమతి పొందిన కళాశాలలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తంగా 304 కాలేజీల్లో ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాలను ఇటీవల చేపట్టింది. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కన్వీనర్ కోటా ప్రవేశాలను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాయి.

ఈ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ కోటా లెక్కలపై దృష్టి సారించింది. ఎన్ని కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులు చేరారన్న లెక్కలు వేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. ఒక్కో కాలేజీలో 50 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 110 ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆయా కాలేజీల భవితవ్యం గందరగోళంగా మారింది. స్పాట్ అడ్మిషన్లు, యాజమాన్య కోటాలో ఎన్ని సీట్లు భర్తీ అవుతాయో తెలియదు.

మరిన్ని వార్తలు