-

కేసీఆర్‌కు ధన్యవాదాలు: బాలకృష్ణ

22 Jun, 2016 23:35 IST|Sakshi
కేసీఆర్‌కు ధన్యవాదాలు: బాలకృష్ణ

హైదరాబాద్: కేన్సర్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వానికి ఆస్పత్రి చెల్లించాల్సిన రుసుమును మాఫీ చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రముఖ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆస్పత్రి  16వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. కేన్సర్ వ్యాధిపై పోరాడి అజేయులుగా నిలిచిన పలువురిని సత్కరించారు.

కుల, మత, ప్రాంత తారతమ్యం లేకుండా అందరికీ అంతర్జాతీయస్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడల్లో విజేతలకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు బహుమతులు అందజేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో ఆర్‌పీ సింగ్, ట్రస్ట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎంవీఎస్‌ఎస్ మూర్తి, జేఎస్‌ఆర్ ప్రసాద్, మెడికల్ డెరైక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు