యాంకర్ దంపతులపై విదేశీయుడి దాడి

9 Mar, 2016 14:05 IST|Sakshi
యాంకర్ దంపతులపై విదేశీయుడి దాడి

స్నిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చుకదా అంటే దాష్టీకం
నిందితుడి రిమాండ్

 
చిక్కడపల్లి: సిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చు కదా... అన్న పాపానికి టీవీ యాంకర్ ఆమె భర్తపై ఓ విదేశీయుడు దాడి చేశాడు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ ఎం.సుదర్శన్ కథనం ప్రకారం... ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లే మార్గంలోని అశోక్‌నగర్ సిగ్నల్ వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఓ చానల్‌లో యాంకర్/న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న శివజ్యోతి తన భర్త ముత్యంతో కలిసి బైక్‌పై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి  చానల్ ఆఫీసుకు వెళ్తోంది. మార్గం మధ్యలో అశోక్‌నగర్ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడటంతో ఆగారు. వెనుకే వాహనంపై వచ్చిన సిరియా దేశస్తుడు సాద్ అబ్దుల్ మున్నమ్ అబ్‌ఫాయప్(25) యాంకర్ శివజ్యోతి బైక్‌ను పక్కకు జరపమన్నాడు.

రెడ్ సిగ్నల్ ఉంది కదా... కొద్ది సెకన్లు ఆగితే వెళ్లిపోవచ్చు కదా అని అంది. దీంతో  ఆగ్రహానికి గురైన అబ్దుల్ మున్నమ్.. శివజ్యోతి చెంపపై కొట్టాడు. ఎందుకు కొడుతున్నావని ఆమె భర్త ప్రశ్నించగా.. ఆయనపై కూడా చెయ్యి చేసుకొని తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అబ్దుల్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు అబ్దుల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

>
మరిన్ని వార్తలు