ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక ‘నెక్ట్స్‌’ తప్పనిసరి

31 Dec, 2016 03:51 IST|Sakshi

- ఆ పరీక్ష పాసైతేనే మెడికల్‌ ప్రాక్టీసుకు రిజిస్ట్రేషన్‌
- ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం
- నెక్ట్స్‌ వద్దన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బుట్టదాఖలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ చదివిన వారికి జాతీయ స్థాయిలో మరో అర్హత పరీక్ష ‘నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్ట్స్‌)’తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ముసాయి దాపై చర్చించాక దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు. అనంతరం అది చట్టంగా ఉనికిలోకి రానుంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ‘నెక్ట్స్‌’పై కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన సంగతి తెలి సిందే. నెక్ట్స్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.

ఎంబీబీఎస్‌ తర్వాత మరో అర్హత పరీక్ష అవసరమే లేదని స్పష్టం చేసింది. నెక్ట్స్‌ పాసయితేనే మెడికల్‌ ప్రాక్టీస్‌కు రిజిస్ట్రేషన్‌ చేసే అంశాన్ని ముడిపెట్టడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. దీని వల్ల జాతీయ స్థాయి లో వైద్య విద్య నిర్వ హణపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొంది. ఎంబీబీఎస్‌ పరీక్ష పత్రాలను ఆరోగ్య విశ్వవిద్యాల యమే తయారు చేసి పరీక్ష నిర్వహిస్తుందని.. అనంతరం విశ్వ విద్యాలయం ఆధ్వ ర్యంలోనే వాల్యుయేషన్‌ చేస్తారని.. ఇంత పకడ్బందీగా పరీక్ష జరుగుతున్నప్పుడు ‘నెక్ట్స్‌’అవసరం ఏముం టుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్రానికి విన్నవించారు. అనేక రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని తెలిసింది. అయితే కేంద్రం మాత్రం నెక్ట్స్‌ను అమలు చేయడానికే మొగ్గు చూపుతోంది.

వైద్య ప్రమాణాలు పడిపోతున్నాయనే..
వైద్య విద్యలో ప్రమాణాలు పోతున్నాయన్న భావన తోనే కేంద్రం నెక్ట్స్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయిం చింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో అనేకచోట్ల వైద్య విద్య ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు వెళ్తున్న సందర్భంలో అనేక కాలేజీలకు సొంతంగా ప్రొఫెసర్లు ఉండటం లేదు. వైద్య విద్యార్థులకు హాస్టల్స్, లైబ్రరీ వంటి మౌలిక సదు పాయాలు ఉండటం లేదు. ఉదాహరణకు ఇటీవల నిజామాబాద్‌ లోని ప్రభుత్వ మెడి కల్‌ కాలేజీ, హైదరా బాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలను ఎంసీఐ తనిఖీ చేసినప్పుడు రెండు చోట్లా అవసరమైన ప్రొఫెసర్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేవని తేలింది. దీంతో నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలోని 150 ఎంబీబీఎస్‌ సీట్లు, ఉస్మానియాలో 50 ఎంబీబీఎస్‌ సీట్లకు వచ్చే ఏడాదికి ఎంసీఐ అనుమతి నిరాకరించింది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్‌ కాలేజీల పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పరిస్థితులు అత్యంత అధ్వా నంగా ఉంటున్నాయన్న భావన కేంద్రంలో ఉంది. అనేకచోట్ల పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఎంసీఐ అధికారుల్లో నెలకొని ఉంది. మరోవైపు ప్రైవేటు కాలేజీలు రూ.కోట్లు డొనేషన్లు తీసుకుని సంబంధిత విద్యార్థులకు పరీక్షల్లో సహకరిస్తున్నా యన్న అను మానాలూ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వీటన్నింటినీ కట్టడి చేయడం కష్టమని.. అందుకే జాతీయస్థాయిలో అర్హత పరీక్ష నిర్వహిస్తే.. నిజమైన అర్హులెవరో తేలుతారని.. వారికే మెడికల్‌ ప్రాక్టీసు రిజిస్ట్రేషన్‌ చేయవచ్చనేది కేంద్రం ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ  చెబుతోంది.

>
మరిన్ని వార్తలు