డీఎస్సీలలో నష్టపోయిన వారికి త్వరలో న్యాయం!

5 Jan, 2016 01:04 IST|Sakshi

వారి సంఖ్య తేల్చాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 1998 నుంచి నిర్వహించిన వివిధ డీఎస్సీల్లో నష్టపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు న్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం కేసీఆర్ వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, జిల్లాలవారీగా ఎంత మంది నష్టపోయిన అభ్యర్థులున్నారో తేల్చాలని ఆదేశించారు. దీంతో ఆయా అభ్యర్థుల వివరాలను సేకరించాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఆదివారం  కేసీఆర్ టీఆర్‌ఎస్ భవన్‌కు వెళ్లిన సమయంలో తమకు న్యాయం చేయాలంటూ వివిధ డీఎస్సీలలో నష్టపోయిన పలువురు అభ్యర్థులు ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో కాన్వాయ్ ఆపి సీఎం వారితో మాట్లాడారు. సోమవారం ఉదయమే విద్యాశాఖ అధికారులను, డీఎస్సీ బాధితులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి చర్చించారు. ప్రస్తుతం 1998 డీఎస్సీలో నష్టపోయి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థుల్లో దాదాపు 800 మంది నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తరువాత డీఎస్సీల్లో నష్టపోయిన వారు మరో 1,500 మందికిపైగా ఉన్నట్లు అంచనా.

మరిన్ని వార్తలు