మూడో కాన్పులోనూ అమ్మాయి పుట్టిందని..

16 Mar, 2017 01:10 IST|Sakshi

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

బంజారాహిల్స్‌: మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందని మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేగంపేట పాటిగడ్డకు చెందిన రాజు(39) శ్రీలత దంపతులు  నందినగర్‌లో నివాసం ఉంటున్నారు. రాజుల ఖైరతాబాద్‌ మింట్‌కంపౌండ్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్‌ప్రెస్‌లో పని చేసేవాడు. వీరికి ప్రణవి(6), ధనవి(3) కుమార్తెలు ఉన్నారు. నెల క్రితం శ్రీలత మూడో కాన్పులో కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఆడపిల్ల పుట్టినట్లు తెలుసుకున్న రాజు భార్యాపిల్లలను అక్కడే వదిలేసి వెళ్లిపోగా, శ్రీలత పసిపాపతో పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మానసికవేదనకు లోనైన అతను తాగుడుకు బానిసై ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు  కిటికీలోనుంచి చూడగా రాజు మృతదేహం కనిపించడంతో బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు