ఎయిమ్స్‌ మంజూరుకు సమస్యల్లేవు

7 Feb, 2018 02:31 IST|Sakshi
లక్ష్మారెడ్డితో భేటీ అయిన ప్రీతి సుడాన్‌

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌

మంత్రి సి.లక్ష్మారెడ్డితో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) మంజూరుకు, నిధులు ఇచ్చేందుకు కేంద్రం నుంచి తగిన ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను రాష్ట్రానికి ఇవ్వడానికి అధికారికంగా ఎలాంటి సమస్యలు లేవని, కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. మంగళవారం సచివాలయం లో మంత్రి లక్ష్మారెడ్డిని ప్రీతి మర్యాదపూర్వ కంగా కలిశారు.

రాష్ట్రంలో అమలవుతున్న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి  కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేశారు. రెండో ఏఎన్‌ఎంలకు కనీస వేతనాలు పెంచా లని కోరారు. ఆశా వర్కర్లకు తెలంగాణలో నెలకు కనీసం రూ.6 వేలు చొప్పున ప్రోత్సా హకాలు అందిస్తున్నామని, కేంద్రం చొరవ తీసుకుంటే వాళ్ల వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వెల్‌నెస్‌ సెంటర్లకు ఆయుష్‌ సేవలు అందేలా చొరవ తీసుకోవా లని కోరారు. క్లినికల్‌ ట్రయల్స్‌కి జాతీయ స్థాయిలో ఒకే రకమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించారు.

కనీసం జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ, చెకింగ్‌ వాహనాలు ఉంటే ఆహార కల్తీ నివారణ పటిష్టంగా వీలవుతుందని తెలిపారు. ప్రీతి స్పందిస్తూ, సిద్దిపేట, సూర్యాపేట, నల్ల గొండ వైద్య కళాశాలలకు మరిన్ని నిధులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. మాతా శిశు వైద్యశాలలను పరిశీలించిన ప్రీతి.. ఇలాంటి మరికొన్ని ఆసుపత్రులను మంజూరు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు