సమాజ హితకారులకే గుర్తింపు: జస్టిస్ చంద్రకుమార్

15 Dec, 2013 03:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎవరైతే తన గురించి గాక సమాజం గురించి ఆలోచిస్తారో వారికి మంచి గుర్తింపు ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం కోర్సులను ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని, దానివెనుక అంబేద్కర్‌తోపాటు మహోన్నతమైన వ్యక్తుల కృషి ఉందని చెప్పారు. మీరు ఒక్క తల్లి కన్నీరైనా తుడవగలిగితే.. అందులో లభించే ఆనందం మరెక్కడా లభించదని అన్నారు.

చనిపోయిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కుటుంబానికి నెలకు రూ.700 నుంచి రూ.750 వరకు పరిహారం చెల్లించాలనే వినతి రాగా.. తాను ఓ జూనియర్ ఇంజనీర్‌కు వచ్చే బేసిక్ జీతాన్ని నష్టపరిహారంగా ఇచ్చేలా తీర్పు ఇవ్వటం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ వెంకటస్వామి, ఓయూ లా కళాశాలల డీన్ జయకుమార్, అంబేద్కర్ విద్యా సంస్థల కార్యదర్శి వినోద్, కళాశాల కరస్పాండెంట్ పి.అశోక్‌కుమార్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు