వెయ్యి రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం

17 Jul, 2016 19:40 IST|Sakshi

కోల్‌కతా నుంచి వెయ్యి రూపాయల నకిలీ నోట్లు తెస్తున్న ఓ వ్యక్తిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారంతండాకు చెందిన కరంటోతు కిషన్(48), రేగోడ్ మండలం జంగంలంకతండాకు చెందిన శంకర్‌నాయక్ స్నేహితులు. ఈ క్రమంలో శంకర్‌నాయక్ వారం కిత్రం కిషన్‌కు రూ.50 నగదు ఇచ్చి కోల్‌కతా సమీపంలోని హౌరాలో ఉన్న గౌసుద్దీన్ అనే వ్యక్తి వద్దకు పంపిచాండు.

 

అతడు వెళ్లి గౌసుద్దీన్‌కు ఆ నగదు ఇవ్వగా...అతడు ఇచ్చిన నకిలీ వెయ్యిరూపాయల నోట్లు రూ.1.10 లక్షలు తీసుకుని శనివారం దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో దిగాడు. విశ్వనీయ సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్‌లో కిషన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతని వద్ద నుంచి లక్షా పదివేల నకిలీ వెయ్యి రూపాయల నోట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కిషన్ గతంలో రూ.3 లక్షల నకిలీ వెయ్యి నోట్లు హౌరా నుంచి తెచ్చినట్లు విచారణలో తేలింది. శంకర్‌నాయక్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

 

మరిన్ని వార్తలు