రైల్వేబ్రిడ్జి పై నుంచి పడ్డ కారు, బైక్.. ముగ్గురి మృతి

29 Mar, 2016 06:32 IST|Sakshi

హైదరాబాద్: అల్వాల్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే వంతెన పైనుంచి కారు, బైక్ కిందపడ్డాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సహా బైక్ నడుపుతున్న వ్యక్తి మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం తిరుమలగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 29 బీబీ 4454 అని పోలీసులు వెల్లడించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతులు శక్తిసింగ్, కృష్ణమాచార్య, కమలిని అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కర్మాన్ ఘాట్ కు చెందిన కృష్ణమాచార్య కుటుంబం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శక్తిసింగ్ అనే వ్యక్తి బైక్ రాంగ్ రూట్ లో నడుపటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయిన ప్రయత్నంలో కారు రైల్వే వంతెన పైనుంచి కిందకి పడిపోగా, ఆ వెంటనే బైక్ కూడా పడిపోయింది.

 

మరిన్ని వార్తలు