మీడియా వాచ్‌డాగ్ పాత్రను వీడొద్దు

21 Jun, 2016 00:20 IST|Sakshi
మీడియా వాచ్‌డాగ్ పాత్రను వీడొద్దు

గవర్నర్ నరసింహన్

 

సిటీబ్యూరో: సమాజ శ్రేయస్సు కోసం పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వాచ్‌డాగ్ పాత్రను వీడొద్దని, మీడియా అప్రమత్తత సమాజానికి ఎంతో మేలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో హైదరాబాద్ నూతన ప్రెస్‌క్లబ్ కార్యవర్గం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేసింది. ఈ సందర్భంగా గవర్నర్ కార్యవర్గంతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మీడియా సంస్థలు సెన్సేషన్‌కు ప్రాధాన్యతనిస్తూ కనీస బాధ్యతలను మరిచిపోతున్నాయనే ఆవేదనను వ్యక్తం చేశారు.


ఏదైనా ప్రమాదం లేదా ఇతర ఘటనలు చోటు చేసుకునే సందర్భాల్లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే విషయాన్ని పక్కనపెట్టి రకరకాల కోణాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్న తీరు ఆవేదన కలిగిస్తోందని, ఈ తీరులో మార్పు తీసుకువచ్చేందుకు యాజమాన్యాలు, మీడియా ఫోరాలు, ప్రెస్‌క్లబ్ లాంటి సంస్థలు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ మరిన్ని చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షులు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులు గాయత్రి, జనార్దన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు దుగ్గు రఘు, రమేష్ వైట్ల ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

 

మరిన్ని వార్తలు