నేడు ఈవీఎంల పంపిణీ

1 Feb, 2016 02:49 IST|Sakshi
నేడు ఈవీఎంల పంపిణీ

గచ్చిబౌలి: గ్రేటర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, సోమవారం ఈవీఎంలు పంపిణీ చేయనున్నట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సర్కిల్-11, 12 డివిజన్‌ల ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంలు, ఇతర మెటీరియల్ పంపిణీ చేస్తామన్నారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

ఆయా రూట్ల వారీగా పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 6.30 లక్షల మంది ఓటర్ స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేందుకు ఇది సంకేతమన్నారు. ఇప్పటికే 80 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, నేడు, రేపు వార్డు కార్యాలయాల్లో స్లిప్పులు అందిస్తారని తెలిపారు. ఓటర్ స్లిప్పులు తప్పనిసరేం కాద ని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. శేరిలింగంపల్లి ఆర్‌ఓ మనోహర్ మెటీరియల్ పంపిణీ గురించి కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి, సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు