అవినీతిపై మీరా మాట్లాడేది ?

21 Jun, 2016 13:22 IST|Sakshi

హైదరాబాద్ : మల్లన్నసాగర్పై రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్లను అడ్డుకోవడం సరికాదని ప్రతిపక్షాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు సూచించారు.

ఎవరు అడ్డుకున్నా... ప్రాజెక్ట్ల నిర్మాణం మాత్రం ఆగదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. అవినీతి గురించి మీరా మాట్లాడేది ? అంటూ టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.భట్టి విక్రమార్కపై బాలసాని లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. అవినీతిపై మీరు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేసిన ఉత్తమ్ ఆ శాఖను అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో దొరికిన కోట్లాది రూపాయిల గురించి.. ఇప్పటి వరకు లెక్క చెప్పలేదని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క పేపరు పులి అని ఆయన అభివర్ణించారు. భట్టి, ఉత్తమ్ అసమర్థులు కాబట్టే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయన్నారు. ముందుగా పదవులకు రాజీనామా చేయాలని ఉత్తమ్, భట్టిలను బాలసాని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు