టాలీవుడ్ హీరో అరెస్టు

25 Mar, 2016 10:02 IST|Sakshi
టాలీవుడ్ హీరో అరెస్టు

బంజారాహిల్స్: పబ్‌లోకి రానివ్వలేదని అద్దాలు ధ్వంసం చేసి.. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి బీభత్సం సృష్టించిన యువ హీరోను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మాదాపూర్‌లో ఉండే యువ హీరో ఉదయ్‌కిరణ్ (ఫ్రెండ్స్‌బుక్, పరారే ఫేం) బుధవారం రాత్రి 11.30కి జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఉన్న ఓవర్ ద మూన్ పబ్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో సెక్యూరిటీ గార్డులు ఉదయ్‌కిరణ్‌ను అనుమతించలేదు. దీంతో అతను ‘నేను హీరోని, నన్నే అనుమతించరా.. అంటూ సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగి అద్దాలు ధ్వంసం చేసి లోనికి తీసుకెళ్లి మద్యం సీసాలు పగులగొట్టి, కుర్చీలు ఎత్తేశాడు.
 
దీంతో పబ్‌లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగుతీశారు.  సెక్యూరిటీ గార్డులనుంచి తప్పించుకొని ఉదయ్‌కిరణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉదయ్‌కిరణ్ డ్రగ్స్ కేసులో మరో కథానాయకుడి సోదరుడు, నైజీరియన్లతో కలిసి పట్టుబడ్డాడు. తాజాగా మూడు నెలల క్రితం కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు.
 
దీంతో అక్కడి పోలీసులు ఉదయ్‌కిరణ్‌పై రౌడీషీట్ తెరిచారు. అంతేకాకుండా పంజగుట్ట పీఎస్ పరిధిలోని ఓ బార్బర్ షాపులో దాడి ఘటనలో ఇతనిపై కేసు నమోదైంది. సీసీఎస్‌లో కూడా ఇతనిపై మరో కేసు ఉంది. వీటికి తోడు ఇటీవల మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిగా ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. కాగా రాత్రి దసపల్లా హోటల్‌లో బీభత్సం సృష్టించినందుకు ఉదయ్‌కిరణ్‌పై న్యూసెన్స్ కేసుతో పాటు సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడినందుకు కేసులు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉదయ్‌కిరణ్  పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
 
 

>
మరిన్ని వార్తలు