పెదనాన్న కొడుకే దారుణానికి పాల్పడ్డాడు

28 Nov, 2014 09:06 IST|Sakshi
పెదనాన్న కొడుకే దారుణానికి పాల్పడ్డాడు

* బంధువులే యమపాశాలుగా మారుతున్నారు

*మొన్న ఆరాధ్య.... తాజాగా ఉదయ్ కిరణ్

హైదరాబాద్: అయినవారే వారి.. పాలిట మృత్యువుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి ఆరాధ్య ఉదంతం మరవక ముందే ...అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. ఒకరేమో భార్యతో సన్నిహితంగా ఉండేందుకు చిన్నారి అడ్డు వస్తుందని బాబాయి పాశవికంగా చంపి పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే...మరొకరు డబ్బు కోసం సోదరుడినే స్నేహితులతో కలిసి హతమార్చారు.  బాటసింగారంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ను హతమార్చింది కూడా స్వయానా పెదనాన్న కొడుకే.  

వివరాల్లోకి వెళితే బాటసింగారం బిల్‌కలెక్టర్‌ పెంటయ్య కుమారుడు ఉదయ్‌కిరణ్‌. పెద్దఅంబర్‌పేట్‌లోని రాజాశ్రీ విద్యామందిర్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. నిన్న స్కూల్‌కు వెళ్లిన ఉదయ్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు. పెంటయ్య అన్న కొడుకు, మాజీ హోం గార్డు నవీన్‌తో పాటు మరో నలుగురు డబ్బు కోసం కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. వనస్థలిపురం చెరువుకట్ట వద్ద విద్యార్థి మృతదేహం బయటపడింది.

నిందితులు సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఉదయ్‌కిరణ్‌ తమను గుర్తు పట్టేయడంతో కిడ్నాప్‌ వ్యవహారం బయటపడుతుందని భయపడి అతడిని గొంతు నులిమి, హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు