-
సాక్షి, హైదరాబాద్ : అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. ఈ రెండేళ్లలో ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బాబూ జగ్జీవన్రామ్ 31వ వర్ధంతి కార్యక్రమాన్ని గాంధీభవన్లో బుధవారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ దళితులకు ఉన్నతస్థానం, అవకాశాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. జగ్జీవన్రామ్ కుమార్తె మీరాకుమార్కు లోక్సభ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. లోక్సభ స్పీకర్గా మీరాకుమార్ ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఉత్తమ్ విమర్శించారు.