మాదిగలకిచ్చిన హామీలను నెరవేర్చాలి

9 Mar, 2018 01:15 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు వంగపల్లి విజ్ఞప్తి

హైదరాబాద్‌: మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఆత్మబలిదానం చేసిన భారతి కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తానని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పిన కేసీఆర్‌ ఇంతవరకు మాట నిలుపుకోలేదని అన్నారు.

‘డప్పు, చెప్పు’కు 2 వేల పింఛన్‌ ఇస్తామని, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయిస్తామని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బెడ, బుడిగ జంగాల హక్కులదండు వ్యవస్థాపక అధ్యక్షుడు తూర్పాటి హనుమంత్, మాదిగ ఉపకులాల అధ్యక్షులు మురళి, కొల్లూరి వెంకట్, రమేశ్, శ్యామ్‌రావు, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు