గురుకుల పోస్టులకు త్వరలో ‘వెరిఫికేషన్‌’

2 Sep, 2017 03:30 IST|Sakshi
గురుకుల పోస్టులకు త్వరలో ‘వెరిఫికేషన్‌’
- ఇతర సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి: టీఎస్‌పీఎస్సీ 
వెబ్‌సైట్‌లో అందుబాటులో ‘కీ’
 
సాక్షి, హైదరాబాద్‌: గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఈ నెల రెండో వారంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈలోగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఆధార్‌ కార్డు తప్పనిసరిగా అందజేయాలని వెల్లడించింది. సర్టిఫి కెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వర లోనే ప్రకటిస్తామని, వారంతా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని సూచించింది. పోస్టులు, జోన్లకు సంబంధించి తమ ప్రాధాన్యాలను తెలియజేస్తూ అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలని పేర్కొంది. వెరిఫికేషన్‌కు అన్ని ఒరిజినల్స్‌ వెంట తేవాలని వెల్లడించింది.
 
సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు ఇవే..
విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ సర్టిఫికెట్‌/ ఎస్సెస్సీ, స్కూల్‌ స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, నాన్‌ క్రీమీలేయర్, నివాస ధ్రువీకరణ పత్రం, వైకల్యం సర్టిఫికెట్‌.
 
నేటి నుంచి ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ
గురుకులాల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌) మెయిన్‌ పరీక్షల ప్రాథమిక ‘కీ’ఈ నెల 2న టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 6 వరకు ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా ఇచ్చిన లింకు ద్వారా తమ అభ్యంతరాలను తెలియజేయొచ్చని పేర్కొంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలు స్వీకరించబోమని వెల్లడించింది. ఇంగ్లిష్‌కు సంబంధించిన అభ్యంతరాలను ఇంగ్లిష్‌లోనే పంపాలని పేర్కొంది. ఇతర భాషలకు సంబంధించిన అభ్యంతరాలను ఆయా భాషల్లో పంపొ చ్చని, అయితే వాటిని పేపరుపై రాసి పీడీఎఫ్‌ చేసి, ఆ ఫైలును అటాచ్‌ చేయాలని సూచించింది. సంబంధిత వివరాలు తమ వెబ్‌సైట్‌లో పొందొచ్చని వివరించింది.  
మరిన్ని వార్తలు