చర్లపల్లి జైలులో వీకే సింగ్‌ ఆకస్మిక తనిఖీ

12 Sep, 2017 01:24 IST|Sakshi
చర్లపల్లి జైలులో వీకే సింగ్‌ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్‌: తెలంగాణ జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌ సింగ్‌ సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడున్నర గంటల పాటు ఆయన జైలులోనే గడిపారు. అక్కడి బ్యారక్‌లు, భోజనం, ఆస్పత్రితో పాటు ఖైదీలకు వసతులు ఎలా ఉన్నాయని పరిశీలించారు. అనంతరం ఆయన నేరుగా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

ఖైదీలకు పేరోల్‌ రాకపోవడం, దోమల బెడద, కోర్టుల్లో జరిమానాలు కట్టలేకపోవడం వంటి పలు సమస్యలను డీజీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం ఆయన చర్లపల్లి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న వ్యవసాయ పనులను పరిశీలించారు. ఓపెన్‌ ఎయిర్‌జైల్‌ను రిసార్ట్‌గా మార్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా చర్లపల్లి జైలు ఉప పర్యవేక్షణాధికారి దశరధంపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో డీజీ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపినట్లు సమాచారం. డీజీ జైలుకు వచ్చిన సమయంలో ఉప పర్యవేక్షణాధికారి జైలులో లేనట్లు తెలిసింది.  
>
మరిన్ని వార్తలు