చేనేతను జీఎస్‌టీ నుంచి మినహాయించాలి

24 Aug, 2017 02:58 IST|Sakshi
తెలంగాణ చేనేత కార్మిక సంఘం డిమాండ్‌
 
సాక్షి, హైదరాబాద్‌: చేనేత రంగాన్ని జీఎస్‌టీ పరిధి నుంచి మినహాయించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి.రాజాను ఢిల్లీలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం కలసి వినతి పత్రాన్ని సమర్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీ, జీఎస్‌టీ కౌన్సిల్‌ సభ్యుడు సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌లకు సంఘం తరపున వినతిపత్రాలు పంపామని టి.వెంకట్రాములు ఓ ప్రకటనలో తెలిపారు.

నేటికీ చేనేత రంగంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించక ఈ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, జీఎస్‌టీలో చేర్చి నూలుపై 5 శాతం, వస్త్రాలపై 18 శాతం పన్ను విధించడం వల్ల చేనేత రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు