శిరీషను హత్య చేసింది ఎవరు?

16 Jun, 2017 11:18 IST|Sakshi

హైదరాబాద్‌: గత మూడు రోజుల ఉత్కంఠ ముగిసింది. బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్య కాదు హత్యే అనే పోలీసులు నిర్ధారించారు. అయితే, ఆమెను ఎవరు హత్య చేశారు? హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి? ఒకరు చేశారా? లేక ఇద్దరు కలిసి చేశారా? మరో వ్యక్తి ప్రోద్భలం ఇందులో ఉందా? అనే కోణంలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు జరగబోయే మీడియా సమావేశంలో ఈ వివరాలన్నింటిని కూడా సీపీ మహేందర్‌ రెడ్డి వెల్లడించనున్నారు. విషయం బయటకొచ్చేందుకు కొద్ది గంటలే ఉన్నప్పటికీ ఎవరు ఈ హత్య చేసి ఉంటారనే విషయంపై మాత్రం జోరుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ముందునుంచే బ్యూటిషియన్‌ శిరీష మృతి కేసు అడుగడుగునా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. సోమవారం ఉదయమే శిరీష స్టూడియోకు రాగా శ్రవణ్, రాజీవ్‌లు మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. వారంతా కలసి రాత్రి 9.30 గంటల సమయంలో రాజీవ్‌కు చెందిన ఎండీవర్‌ కారులో కుకునూర్‌పల్లికి వెళ్లారు. నేరుగా ప్రభాకర్‌రెడ్డి పోలీస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వెళ్లేముందు రాత్రి 8.40 గంటల సమయంలో తన భర్తకు ఫోన్‌ చేసిన శిరీష.. ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. అర్ధరాత్రి వరకు ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పంచాయితీ జరిగాక.. సుమారు ఒంటిగంట సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 1.40 గంటలకు శిరీష తాను శామీర్‌పేట ప్రాంతంలో ఉన్నట్లుగా తన భర్త సతీశ్‌చంద్రకు వాట్సాప్‌ ద్వారా లోకేషన్‌ పంపింది. ఆ వెంటనే సతీశ్‌ ఫోన్‌ చేసినా స్పందించలేదు. తెల్లవారుజామున 4.30 గంటలకు మరోసారి ఫోన్‌ చేసినా స్పందన రాలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ముగ్గురూ స్టూడియో వద్దకు చేరుకున్నట్లు ఇప్పటి వరకు వారు చెప్పిన సమాచారం.

అయితే, ఈ క్రమంలో మార్గమధ్యంలో వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి శిరీష కారు కూడా దిగి వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలోనే వారు కారులోకి బలవంతంగా ఎక్కించి ఏదో ఒకటి చేసి ఉండొచ్చని అనుమానం కలుగుతోంది. కారులో మార్గం మధ్యలోనే హత్య చేశారా? లేక స్టూడియోకు వచ్చిన తర్వాత ఆ పనిచేశారా? ఇంతకీ హత్య చేసిన వ్యక్తులు ఈ కేసులో ముందు నుంచి నిందితులుగా పేర్కొంటున్న వారేనా? లేక కొత్త వ్యక్తులు ఉన్నారా అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు