కొత్త సీఎస్‌ ఎవరు? 

29 Jan, 2018 02:26 IST|Sakshi

మూడు రోజుల్లో ముగియనున్న ఎస్పీ సింగ్‌ పదవీకాలం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. మరో మూడు నెలల పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఎస్పీ సింగ్‌ పదవీ విరమణకు మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో కేంద్రం అనుమతి మంజూరు చేస్తుందా.. లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కేంద్రం నుంచి అనుమతి రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్‌గా ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం స్పెషల్‌ సీఎస్‌లుగా ఉన్న వారందరూ సీఎస్‌ పదవికి అర్హులైనప్పటికీ.. ఎస్‌కే జోషి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎస్పీ సింగ్‌ పదవీకాలం పొడిగించకపోతే జోషిని కొత్త సీఎస్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  

>
మరిన్ని వార్తలు