షీ ఈజ్ స్వాతి

8 Mar, 2017 02:27 IST|Sakshi
షీ ఈజ్ స్వాతి

పరిచయస్తులే పోకిరీలు
వేధించేవారిలో 80 శాతం వారే..
వీరిలో విద్యార్థులే ఎక్కువ
ఆ 15 శాతం పురుషులతోనే సమస్య
షీ–టీమ్స్‌తో మహిళకు భరోసా
‘సాక్షి’తో అదనపు సీపీ స్వాతి లక్రా


సిటీబ్యూరో: మహిళ కనిపిస్తే చాలు మృగాళ్లు మేల్కొంటున్నారు. వెంటపడి వేధిస్తున్నారు. వనితతో స్నేహం నటిస్తునే అదును చూసి కాలనాగులై కాటేస్తున్నారు. మహానగరంలో ‘ఆమె’కు షీ–టీమ్స్‌ ఓ భరోసా. కొంత కాలంగా షీ–టీమ్స్, భరోసా కేంద్రాల్లో నమోదవుతున్న వేధింపుల కేసుల్లో 80 శాతం పరియస్తులే నిందితులుగా ఉంటున్నట్టు అదనపు సీపీ (నేరాలు, సిట్‌) స్వాతి లక్రా తెలిపారు. వీరిలో అత్యధికులు విద్యార్థులేనన్నారు. షీ–టీమ్స్, భరోసా కేంద్ర ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. మహిళకు అందిస్తున్న భరోసాను వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

బాధితులు బయటకు వస్తున్నారు..
వేధింపుల బారినపడిన మహిళలు/యువతులు ఒకప్పుడు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేసేవారు. పోలీసులంటే భయం ఉండడంతో పాటు కుటుంబ గౌరవం తదితర అంశాలు దీనికి కారణమయ్యేవి. ఇటీవల కాలంలో బాధితుల్లో ఆ భయం పోయింది. షీ–టీమ్స్, భరోసా ద్వారా పోలీసులపై నమ్మకం పెరిగింది. దీంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. మా బాధ్యత కూడా గణనీయంగా పెరిగింది. బాధితులకు సత్వర న్యాయం చేస్తున్నప్పటికీ.. సాంకేతిక అంశాలతో కూడిన కేసుల దర్యాప్తునకు కొంత సమయం పడుతోంది.

సిబ్బందికి టార్గెట్స్‌ ఇవ్వనేలేదు..
షీ–టీమ్స్‌ ఏర్పడిన నాటి నుంచి నగర వ్యాప్తంగా అనేక బృందాలు పనిచేస్తూ పోకిరీల పనిపడుతున్నాయి. గడిచిన రెండేళ్లల్లో ఇలా వందల కేసులు నమోదయ్యాయి. అయితే ఏ ఒక్క సందర్భంలోనూ రోజుకు ఇన్ని కేసులు ఉండాలంటూ మా సిబ్బందికి టార్గెట్లు ఇవ్వలేదు. షీ–టీమ్స్‌ ప్రారంభించిన ఏడాది(2014) కేసుల సంఖ్య తక్కువే. 2015లో వీటి సంఖ్య పెరిగిపోయింది. ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా నగరంలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాని అనే భావించే ఆస్కారం ఉందని తెలిసీ వెనుకాడలేదు. అలా ప్రతి కేసుపైనా చర్యలు తీసుకున్నాం. దీంతో గతేడాది నాటికి సిటీలో మహిళలు/యువతులపై వేధింపులు తగ్గి కేసుల సంఖ్య కూడా తగ్గింది.

అమాయకుల్ని బలికానీయట్లేదు...
మహిళలు/యువతుల నుంచి మాకు అందుతున్న ప్రతి ఫిర్యాదునీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. కొన్ని అంశాల్లో వారిదే పొరపాటుగా తేలుతోంది. ఇలాంటి వాటితో తొందరపడితే  అమాయకులు బలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి కేసునూ లోతుగా పరిశీలించి, పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిందితులపై చర్యలు తీసుకుంటున్నాం. ఇదే మా పనితీరుపై అందిరికీ నమ్మకం పెంచింది. బాధితులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నాం. రెండేళ్లలో 50 మందిపై నిర్భయ చట్టం, 40 మందిపై ఐటీ యాక్ట్, ముగ్గురిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాం.

15 శాతం మందే పోకిరీలు
గడిచిన రెండేళ్లలో ఎన్నో కేసుల్ని అధ్యయనం చేశాం. ఇందులో యువకులు/పురుషుల్లో 85 శాతం మంచివారే అని తేలింది. మిగిలిన 15 శాతం మందిలోనే వేధింపు రాయుళ్లు, పోరికీలు ఉంటున్నారు. అలా తక్కువ శాతం ఉన్నవారి వల్ల ఎక్కువ శాతం ఉన్న వారికి చెడ్డపేరు వస్తోంది. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని పోరికీలను అరికట్టే బాధ్యతను మంచివారూ తీసుకోవాలి. వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని ప్రచారం చేస్తున్నాం. కాలేజీ విద్యార్థులు, మైనర్లు ఒకప్పుడు టీజింగ్‌ చేయడం గొప్పగా భావించేవారు. వారందరిలో ‘అది తప్పు’ అనే భావన తీసుకురాగలిగాం. ఇదే మాకు పెద్ద సక్సెస్‌. మైనర్లకు తల్లిదండ్రులతో కలిసి కౌన్సిలింగ్‌ ఇస్తున్నప్పుడు ఇరువురిలోనూ మార్పు రావడంతో పాటు బాధ్యత పెరుగుతోంది.

తెలిసి దాచినా నేరమే..
ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. అయితే కేవలం కొన్ని మాత్రమే కేసులుగా నమోదవుతున్నాయి. ఇలాంటి కేసుల్ని పోలీసులు ‘పోక్సో’ యాక్ట్‌ ప్రకారం నమోదు చేస్తారు. ఓ చిన్నారికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిసీ పోలీసులకు ఫిర్యాదు చేయని తల్లిదండ్రులూ బాధ్యులే అని ఈ చట్టంలో ఉంది. పాఠశాలల్లో వేధింపులు జరిగినప్పుడు బాధ్యతలపై వారు అంతర్గతంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నా వారూ బాధ్యులవుతారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే మరో చిన్నారిని బలి తీసుకుంటారనేది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.

ప్రాంతాల వారిగా కమిటీలు వేస్తాం..
ఇప్పటికీ కొందరు బాధిత యువతులు తమకు ఎదురైన చేదు అనుభవాలపై ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయట్లేదనిగమనించాం. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాలేజీల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేశాం. బాధితుల ఈ కమిటీని ఆశ్రయిస్తే.. వారు విషయాన్ని షీ–టీమ్స్‌ దృష్టికి తీసుకువస్తారు. భవిష్యత్తులో కాలనీలు, అపార్ట్‌మెంట్లు, మొహల్లాలు, స్లమ్స్‌ల్లోనూ స్థానికులతో ఇలాంటి కమిటీలే ఏర్పాటు చేయనున్నాం. ఓ మహిళ సాటి మహిళకు కచ్చితంగా సహకరించాలి. అప్పుడే సిటీ పూర్తిస్థాయి సేఫ్‌ హైదరాబాద్‌గా మారుతుంది.

మరిన్ని వార్తలు