క్యాబ్‌లో వెళ్లిన యువతి అదృశ్యం

3 May, 2017 20:36 IST|Sakshi
క్యాబ్‌లో వెళ్లిన యువతి అదృశ్యం

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): ఇంటి నుంచి క్యాబ్‌లో వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయింది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-4లోని స్టోన్‌వ్యాలీ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే సుశ్మితా గాయత్రి విష్ణుభట్ల(22) మంగళవారం ఉదయం క్యాబ్‌లో బయటకు వెళ్లింది. సాయంత్రం ఎంతకూ తిరిగి రాకపోయేసరికి తండ్రి చంద్రమౌళి బంధుమిత్రుల ఇళ్లలో వాకబు చేశారు.  ఫోన్‌ చేసినా సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ అని వచ్చింది. అంతకుముందే బ్యాంకులో నుంచి రెండు దఫాలుగా రూ.15 వేలు డ్రా చేసినట్లు మెస్సేజ్‌లు అందాయి.

ఆమె ఫోన్‌ నంబర్‌కు ప్రయత్నించగా లిఫ్ట్‌ చేయడం లేదు. క్యాబ్‌ డ్రైవర్‌ కోసం ఆరా తీయగా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని క్యాబ్‌ వివరాల కోసం ఆరా తీస్తున్నారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటుచేసి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు. అదృశ్యమైన యువతి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె అదృశ్యం కేసును ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

>
మరిన్ని వార్తలు