షాపు యజమానినే దోచుకోవాలని...

10 Apr, 2016 21:49 IST|Sakshi

సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): ఓ వ్యాపారిని దోపిడి చేసేందుకు యత్నించిన ఐదుగురు దొంగల ముఠాను ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బజార్‌ఘట్‌కు చెందిన బషీర్ కోఠిలోని ట్రూప్‌బజార్‌లో బాంబే స్పేర్‌పార్ట్స్ పేరిట ఆటో మోబైల్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు రూ. 5 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. దీంతో అదే దుకాణంలో పనిచేసే పహాడిషరీఫ్‌కు చెందిన జహంగీర్ అనే యువకుడికి దుర్బుద్ధి పుట్టింది. తనకు తెలిసిన ఓ రౌడీషీటర్ ఇతర వ్యక్తులతో బషీర్‌ను దోచుకునేందుకు ప్రణాళిక వేశారు.

గతంలో డిసెంబర్ 2015న బషిర్‌ను దోచుకునేందుకు ప్రయత్నించి వీరు విఫలమయ్యారు. అయినా తన ఆలోచన మానుకోలేదు. పహాడిషరీఫ్‌కు చెందిన మహ్మద్ ఫిరాజ్ అలియాస్ నిర్రా(24), బంజారాహిల్స్‌కు చెందిన సయ్యద్ మాజీద్(22), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ వహీద్(21) పహాడీషరీఫ్‌కు చెందిన జంగీర్‌ఖాన్(20), అదే ప్రాంతానికి చెందిన షాబాజ్‌ఖాన్(21)లు కోఠిలోని ట్రూప్ బజార్‌లో ప్లాన్ సిద్దం చేశారు.

బషీర్ దుకాణం నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో అతడిపై కారం చల్లి డబ్బు దోచుకోవాలని పథకం పన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమాదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు