హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి బాలాజీనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుడి మృతికి పరిహారం చెల్లించాలని పెద్ద ఎత్తున కూలీలు కూకట్పల్లి ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టడానికి యత్నించగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం(మంగళవారం) బాలాజీనగర్లోని ఓ ఇంట్లో డ్రైనేజి పనులు చేస్తున్న నిరంజన్ అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన తోటి కూలీలు అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిఫలం అందకపోవడంతో.. ఆగ్రహించిన కూలీలు గురువారం ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి అందిస్తామన్న రూ. 4 లక్షల పరిహారం సరిపోదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.