ఎంటెక్‌ చదివినా ఉద్యోగం రాలేదని..

7 Jan, 2017 00:19 IST|Sakshi
ఎంటెక్‌ చదివినా ఉద్యోగం రాలేదని..

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదన్న బెంగ ఓ వైపు.. అనారోగ్యంతో బాధపడు తున్న తల్లి మరోవైపు... ఇంటి పెద్ద కొడుకుగా తానేమీ చేయలేకపోతు న్నానని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు తాను ఉంటున్న అపార్టు మెంటుపై నుంచి నాలాలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర శుక్రవారం వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లు గ్రామానికి చెందిన ఉప్పలయ్య, కోటమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌(23) ఎంటెక్‌ చదివి ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. చైతన్యపురి గంగోత్రి అపార్టుమెంటులో స్నేహితుల తో కలసి ఉంటున్నాడు.

కొంతకాలంగా ఉద్యోగం రాలేదని వేదన పడుతు న్నాడు. అతని తల్లి కోటమ్మ కేన్సర్‌తో బాధపడుతోంది. కాగా, శుక్రవారం తెల్లవారు జామున భవనం పైనుంచి ఎవరో దూకిన శబ్దం రావటంతో ఉప్పలయ్య బయటకు వచ్చి చూశాడు. అపార్టుమెంటు పక్కనున్న నాలాలో ఎవరో పడినట్టు గమనించిన ఆయన కిందికి వెళ్లి చూడగా శ్రీనివాస్‌ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

మరిన్ని వార్తలు