హెల్మెట్ లేదు.. మావాడే వదిలేయండి..

20 Apr, 2016 18:24 IST|Sakshi
హెల్మెట్ లేదు.. మావాడే వదిలేయండి..

లంగర్‌హౌస్: హెల్మెట్ లేకపోవడంతో పాటు కనీసం డ్రైవింగ్ లెసైన్స్ కూడా లేదని ప్రశ్నించినందుకు ఓ యువకుడు ట్రాఫిక్ ఎస్సైపై దాడికి దిగాడు. ఆ యువకుడు తమవాడేనంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఎస్సైపై బెదిరింపులకు దిగారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిదిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో మధు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా బుధవారం ఉదయం రేతిబౌలి చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కౌషిక్ (24) అనే యవకుడు తన ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం నుండి అత్తాపూర్ వైపు వెళుతున్నాడు. హెల్మెట్ లేకుండా వెళుతున్న అతన్ని రేతిబౌలి వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారు. కనీసం డ్రైవింగ్ లెసైన్స్ లేదని చెప్పాడు.

దీంతో వాహనాన్ని పక్కకు తీసుకోవాలని పోలీసులు చెప్పడంతో కౌశిక్ అక్కడ ఉన్న కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడు. గమనించిన ఎస్సై మధు అక్కడకు చేరుకోవడంతో కౌషిక్ ఎస్సై మధుపై అందరు చూస్తుండగేనే దాడికి దిగాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడి చేసిన యువకుడు తమవాడేనని అతన్ని వదిలేయాలంటూ పలువురు టీఆర్‌ఎస్ నాయకులు లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హంగామా చేశారు.

మరిన్ని వార్తలు