బార్లో లొల్లి.. రోడ్డు మీద ఫైటింగ్

29 Apr, 2015 23:43 IST|Sakshi

గుంపుగా వచ్చిన కొందరు గుర్తుతెలియని దుండగులు పాన్‌షాపు దగ్గర పాన్ తీసుకుంటున్న ముగ్గురు వ్యక్తులపై విచక్షణ రహితంగా దాడి చేసి వారి వద్ద నుంచి రూ.7వేల నగదు, సెల్‌ఫోన్లు దోచుకొనిపోయారు. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు.. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాలచందర్ తన స్నేహితులు రాకేశ్, మల్లేశ్‌లతో కలిసి మంగళవారం రాత్రి మూసారాంబాగ్ దగ్గర ఉన్న ఎస్‌ఎల్‌ఎన్ బార్ అండ్ రెస్టారెంట్‌కు మద్యం సేవించడానికి వెళ్లారు. అక్కడ అనుకోకుండా రాకేష్ తాగుతున్న మద్యం గ్లాసు కిందపడింది. అందులో ఉన్న మద్యం పక్క టేబుల్‌పై ఉన్న ఒక వ్యక్తిపై పడింది. ఈ విషయంలో గొడవ ప్రారంభమైంది.

బార్ యజమాని వచ్చి సముదాయించి క్షమాపణ చెప్పించారు. అక్కడ నుంచి వారు అలీకేఫ్ చౌరస్తాలోని శివానంద్ హోటల్ దగ్గర పాన్‌కోసం ఆగారు. అదే సమయంలో బార్‌లో గొడవ పడిన వారు ఆటోలో 12 మందితో గుంపుగా వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 7వేల నగదు, సెల్‌ఫోన్‌లు, హోండా వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. వాహనాన్ని మూసారాంబాగ్ బ్రిడ్జి అవతల వదిలి వెళ్లారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు