నేడే ప్రజాస్వామ్య రణభేరి

23 Apr, 2016 06:37 IST|Sakshi
నేడే ప్రజాస్వామ్య రణభేరి

♦ బాబు అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా ‘సేవ్ డెమొక్రసీ’
♦ నేటి నుంచి ఆందోళన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం
♦ వామపక్షాలతోపాటు పలు రాజకీయ పార్టీల మద్దతు
♦ జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు, బహిరంగ సభలు
 
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తూ సంతబేరాలు సాగిస్తున్న సీఎం చంద్రబాబు తీరును తీవ్రంగా గర్హిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. అధికారం చేపట్టింది మొదలు అడ్డగోలుగా దోచుకున్న అవినీతి సొమ్మును విరజిమ్ముతూ ప్రజాతీర్పుకు వెన్నుపోటు పొడుస్తున్న బాబు చర్యలపై ప్రజలను చైతన్యపరచేందుకు శనివారం సాయంత్రం రాష్ర్టం లోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు.

అనంతరం బహిరంగ సభలు నిర్వహించి బాబు నీచ రాజకీయాలను ప్రజలకు వివరిస్తారు. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఆశచూపి, తమ పార్టీలో చేరితే ఉన్న కేసులు తప్పిస్తామనీ లేదంటే కొత్త కేసులు బనాయిస్తామనీ బెదిరించి.. సామ దాన భేద దండోపాయాలతో విపక్ష ఎమ్మెల్యేలను లొంగదీసుకుని నిస్సిగ్గుగా పచ్చ కండువాలు కప్పుతున్న తీరును ఎండగడతారు. బాబు నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమాలకు వామపక్షాలతో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఒకసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల వరకూ ప్రజలతో అవసరం లేదని బరితెగించి వ్యవహరిస్తే ప్రజలే ప్రతిపక్షమవుతారని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల మద్దతుతో దీన్ని తీవ్రస్థాయి ప్రజా ఉద్యమంగా మలిచేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమవుతోంది.

 నేడు గవర్నర్ వద్దకు జగన్
 సీఎం హోదాలో చంద్రబాబు పాల్పడుతున్న అనైతిక రాజకీయ వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు శనివారం ఉ. 11 గంటలకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ నేతలతో కలసి గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. రెండేళ్ల పాలనలో అవినీతికి పాల్పడి సంపాదించిన సొమ్ముతో బాబు విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కోనుగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు. బాబుపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేస్తారు.

 25న ప్రధాని, రాష్ట్రపతితో భేటీ!
 రాష్ట్రంలో జరుగుతున్న అరాచకీయాన్ని జాతీయ స్థాయిలోనూ వివరించేందుకు జగన్‌మోహన్‌రెడ్డితో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్లాలని ఈ నెల 19న పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ‘సేవ్ డెమొక్రసీ’ ఆందోళన తర్వాత రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలవనున్నారు. అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలు ఇస్తామని, మంత్రి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనుగోలు చేస్తున్న అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనైతిక రాజకీయ కార్యకలాపాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలసి వివరించి చెబుతారు. ఫిరాయింపు నిరోధక చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారన్నదానిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నారు.

మరిన్ని వార్తలు