హిట్లర్‌ను తలపిస్తున్నారు

3 Jun, 2016 01:39 IST|Sakshi

చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: నియంత హిట్లర్ ఆలోచనా ధోరణికి కొనసాగింపుగానే సీఎం చంద్రబాబు నవ నిర్మాణదీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. ఆయన పాలన భయానకం, మాటలు ఓ బూటకమని గురువారం ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రాన్ని విభజించడానికి ఒకటి.. రెండు కాదు నాలుగుసార్లు లేఖలివ్వడమేగాక లోక్‌సభలో తెలంగాణ విభజనకు తొలి ఓటు తమ పార్టీదేనంటూ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతతో ప్రకటింపజేసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టించిన చంద్రబాబు ఇప్పుడు విభజనకు వ్యతిరేకంగా నవ నిర్మాణదీక్ష చేస్తున్నానంటుండటం నయవంచన అని ధ్వజమెత్తింది.

‘‘ఇది నవ నిర్మాణ దీక్ష కాదు... నయవంచన దీక్ష, అవినీతి మీద, కుట్ర రాజకీయాలమీద ప్రజలు ధ్వజమెత్తాలన్న నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ప్రకారం.. రాష్ట్ర ప్రజల తొలి లక్ష్యం కచ్చితంగా ఇక చంద్రబాబు ప్రభుత్వమే కావాలి’’ అని స్పష్టం చేసింది. ప్రతిఒక్కరూ దీక్షలో పాల్గొనాలని, 11 గంటలకు ఎక్కడి వారక్కడ నిలిచిపోవాలంటూ చివరకు నియంతృత్వ దేశాల్లోనూ చేయని వెర్రిమొర్రి ఆలోచనలకు, ఎమర్జెన్సీని మించిన దుష్ట పోకడలకు చంద్రబాబు బుర్ర కేంద్రస్థావరంగా మారిందని మండిపడింది.

>
మరిన్ని వార్తలు