- వైఎస్సార్ కాంగ్రెస్ ఆగ్రహం.. నేడు కర్నూలు జిల్లా బంద్
- నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు, పత్తికొండ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తిలే ఒక పథకం ప్రకారం వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య జరిగిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందని తెలిపింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నారాయణరెడ్డి దారుణ హత్యకు నిరసనగా సోమవారం కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది.
గత మూడేళ్లుగా టీడీపీ సాగిస్తున్న అరాచక పాలనకు నారాయణరెడ్డి హత్య పరాకాష్టగా వైఎస్సార్సీపీ పేర్కొంది. ఈ హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఖండిస్తున్నామని తెలిపింది. గుంటూరులో ఉండగా ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కడప పర్యటనను రద్దు చేసుకున్నారని, సోమవారం వెల్దుర్తి మండలం చెరుకులపాడులో జరిగే నారాయణరెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరవుతారని పార్టీ తెలియజేసింది.