హైదరాబాద్ : చిత్తూరుజిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విప్ ఎన్. అమరనాథరెడ్డి స్పీకర్కు రాసిన వినతిపత్రాన్ని చెవిరెడ్డి ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందజేశారు.
టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ గూడూరు ఎమ్మెల్యే పాశం సునిల్కుమార్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పై అనర్హత వేటు వేయాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు. వినతి పత్రంతో పాటు సీడీ కూడా అందజేశారు.
కాగా టీడీపీ ప్రభుత్వం బరితెగించి అవినీతి సొమ్ము, బ్లాక్ మనీతో విపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న వ్యవహారంపై ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకు వెళ్లారు.