ప్రజలకు గుదిబండలా బడ్జెట్

15 Mar, 2016 01:48 IST|Sakshi

ప్రభుత్వం, చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం
 
 సాక్షి,హైదరాబాద్: ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు గుదిబండలా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్ ప్రజల జీవనస్థితిగతుల మెరుగుకు తోడ్పడేలా లేదన్నారు. అభివృద్ధి రేటు పెద్ద బోగసని మండిపడ్డారు. అన్నింటిలో కేటాయింపులు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక విమానాలు, విజయవాడ, హైదరాబాద్‌లో సీఎం క్యాంపు కార్యాలయాల మరమ్మతుల పేరుతో.. కన్సల్టెంట్లు, ఈవెంట్లు, పుష్కరాలకు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఒకవైపు తుపాన్లు, మరోవైపు కరువుతో అపార పంట నష్టం వాటిల్లిందన్నారు. తీవ్ర అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు అందించే సహాయం రోజు రోజుకి కుచించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ, మార్కెట్ ధరలు ఇవ్వడం లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు