కల'కలం'.. ఆసియాలో ఇండియానే డెడ్లీయెస్ట్‌!

29 Dec, 2015 18:51 IST|Sakshi
కల'కలం'.. ఆసియాలో ఇండియానే డెడ్లీయెస్ట్‌!

పారిస్: విధి నిర్వహణలో భాగంగా 2015లో ప్రపంచవ్యాప్తంగా 110 మంది పాత్రికేయులు ప్రాణాలు విడిచారు. ఇందులో చాలామంది యుద్ధ కల్లోల ప్రాంతాల్లో వార్తలు అందిస్తూ మృత్యవాత పడగా.. శాంతియుత దేశాలుగా పేరొందిన వాటిలోనూ చాలామంది హత్యలకు గురయ్యారని రిపోర్టర్స్ వితౌట్‌ బార్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) సంస్థ పేర్కొంది.

ఈ ఏడాది విధి నిర్వహణలో భాగంగా 67 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఆర్ఎస్‌ఎఫ్‌ తన వార్షిక రౌండప్ నివేదికలో తెలిపింది. యుద్ధ కల్లోల దేశాలైన ఇరాక్‌, సిరియాలు జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరొందాయని, ఇరాక్‌లో 11 మంది, సిరియాలో 10 మంది విధినిర్వహణలో చనిపోయారని తెలిపింది. ఆ తర్వాత స్థానంలో ఫ్రాన్‌ ఉందని, ఫ్రాన్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు వ్యంగ్య కార్టూన్ పత్రిక చార్లీ హెబ్డోపై జరిపిన దాడిలో 8 మంది పాత్రికేయులు మరణించారని పేర్కొంది. మరో 47 మంది పాత్రికేయులు విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, అయితే, వారి మృతికి దారితీసిన కారణాలు స్పష్టంగా తెలియలేదని ఆ సంస్థ వివరించింది. అలాగే 27 మంది నాన్ ప్రొఫెషనల్ పౌర పాత్రికేయులు, ఏడుగురు మీడియా సిబ్బంది కూడా హత్యకు గురయిన వారిలో ఉన్నారని వివరించింది.

ఇక భారత్ విషయానికొస్తే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఆర్‌ఎఫ్‌ఎస్‌ స్పష్టంచేసింది. వ్యవస్థీకృత నేరాలు, వాటితో రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయడం, అక్రమ మైనింగ్‌ బాగోతాన్ని వెలుగులోకి తేవడం వంటి కారణాలతో జర్నలిస్టులు అమానుషంగా హతమయ్యారని వివరించింది. వీరిలో ఐదుగురు పాత్రికేయులు విధినిర్వహణలో హత్యకు గురవ్వగా, మరో నలుగురు గుర్తుతెలియని కారణాలతో చనిపోయారని, అందుకే ఫ్రాన్స్ తర్వాత ఇండియాను చేర్చినట్టు ఆ సంస్థ తెలిపింది. 'ఆసియాలో జర్నలిస్టులకు భారతే అత్యంత ప్రమాదకరం దేశమని ఈ మరణాలు చాటుతున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌ కంటే భారత్‌ ముందున్నది' అని ఆర్‌ఎఫ్‌ఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల కాపాడేందుకు కేంద్రప్రభుత్వం జాతీయ ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరముందని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
 

>
మరిన్ని వార్తలు