కొలంబియాలో విమాన ప్రమాదం

11 Mar, 2019 04:44 IST|Sakshi

12 మంది మృతి  

బొగటా: కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులోని మొత్తం పన్నెండు మంది చనిపోయారు. ప్రమాదంలో తరైరా, డోరిస్‌ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్‌ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 1930లో అమెరికాలో తయారైన డగ్లస్‌ డీసీ–3 విమానం శాన్‌ జోస్‌ డెల్‌ గ్వావియేర్, విల్లావిసెన్సియో పట్టణాల మధ్య కూలిపోయిందని అధికారులు చెప్పారు. విమాన ఇంజిన్‌ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని అధికారులు వివరించారు. అధ్యక్షుడు ఇవాన్‌ డుక్యూ మృతులకు ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. ప్రమాదానికి గురైన విమానాన్ని నిర్వహిస్తున్న లాజార్‌ ఏరియో కంపెనీ ఘటనపై స్పందించడానికి నిరాకరించింది.

మరిన్ని వార్తలు