ఆసుపత్రుల్లో నీటి కరువు

24 Jun, 2016 13:38 IST|Sakshi

వాషింగ్టన్: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఆసుపత్రుల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని అధ్యయనంలో తేలింది. ఈ దేశాల్లో మూడింట ఒక వంతు ఆసుపత్రుల్లో, తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వాడే నీరు తగినంత లభ్యమవడం లేదు. ఉన్న నీరూ పరిశుభ్రంగా ఉండడం లేదు. దీని వల్ల ఆసుపత్రి పరిసరాల్లో స్వచ్ఛత లోపించడంతోపాటు శస్త్రచికిత్సల కోసం వాడే పరికరాలను శుభ్రం చేసేందుకూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అపరిశుభ్ర నీటితో కత్తులు, కత్తెర్లను శుభ్రం చేసి వినియోగించడం వల్ల రోగులకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు.

అనేక ఆసుపత్రుల్లో నీటిని ట్యాంకర్ల ద్వారా రప్పించడంతోపాటు వర్షపు నీటిని నిల్వ చేసి వాడుతున్నారనీ, ఈ నీటిలో శుభ్రత లోపిస్తోందని అమెరికాలోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల సంయుక్త బృందం తెలిపింది. వీరిలో భారత సంతతికి చెందిన సాగర్ ఎస్ చావ్లా, శైల్వి గుప్తా కూడా ఉన్నారు. దీని కోసం వీరు ప్రత్యేకంగా సర్వే చేయకుండా 2009 నుంచి 2015 వరకు చేసిన 19 సర్వేల సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు.

మరిన్ని వార్తలు