నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం

4 Jun, 2014 03:45 IST|Sakshi

18 మంది భారతీయ యాత్రికుల దుర్మరణం
 కఠ్మాండు: ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం సుమారు 18 మంది ప్రయాణికుల ప్రాణాలను హరించడమే కాకుండా మరో 53 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యేలా చేసింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ తన సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి సమీపంలోని నదిలోకి దూసుకుపోయింది. ఈ ఘోర దుర్ఘటన నేపాల్‌లోని ప్యూథాన్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది.
 
 మృతి చెందిన ప్రయాణికులు అందరూ భారత్‌కు చెందిన వారే. నేపాల్‌లోని పవిత్ర స్వర్గద్వార్‌ను దర్శించుకున్న యాత్రికులు తిరుగు ప్రయాణంలో ఈ బస్సు ఎక్కారు. డ్రైవర్ సెల్ ఫోన్‌ను వినియోగించేందుకు యత్నించిన సమయంలో బస్సు అదుపుతప్పి దాదాపు 100 మీటర్ల మేర దొర్లుకుంటూ మాది ఖోలా నదిలో పడిపోయింది. బస్సులోని 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతి చెందారు. చనిపోయిన భారత పౌరుల్లో ఎక్కువ మంది యూపీ వాసులని అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు