సింగపూర్ జలాల్లో చిక్కుకున్న భారత నావికులు

19 Sep, 2013 00:53 IST|Sakshi

ఫిబ్రవరి నుంచి నౌకలోనే.. నానాకష్టాలు పడుతున్న 22 మంది
 సింగపూర్: భారత్‌కు చెందిన 22 మంది నావికులు సింగపూర్ జలాల్లో చిక్కుకుపోయి గత ఫిబ్రవరి నుంచి నానా కష్టాలు పడుతున్నారు. తైవాన్‌కు చెందిన చమురు రవాణా నౌక ‘ఫార్చ్యూన్ ఎలిఫెంట్’ కొద్దినెలల క్రితం సింగపూర్ తీరానికి వెళ్లింది. ఇందులో 22 మంది భారత నావికులతోపాటు ఒక రోమన్ దేశస్తుడు ఉన్నారు. నౌకలోని చమురు అన్‌లోడింగ్ చేయరాదంటూ సింగపూర్ సుప్రీంకోర్టు నుంచి తైవాన్‌కు చెందిన క్యాథే యునెటైడ్ బ్యాంక్ అనుమతి తెచ్చుకుంది. దీంతో 3 నెలల నుంచి చమురు అన్‌లోడింగ్ నిలిచిపోయింది. ఫలితంగా సిబ్బంది అంతా నౌకలోనే ఉండాల్సి వ స్తోంది. నీరు, తిండి, వేతనానికి ఇబ్బందేమీ లేకపోయినా నౌక నుంచి బయటకు రావడంపై ఆంక్షలు కొనసాగుతుండడంతో ఇబ్బందులపాలవుతున్నారు. కిందటివారం నావికులను మూడుగంటలపాటు సింగపూర్‌లోకి అనుమతించారు. నౌక మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల పరిమాణంలో ఉంది. ‘‘టీవీలు చూస్తూ, రేడియో వింటూ, తమ ఇళ్లకు ఫోన్లు చేస్తూ సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ వారిలో నిరాశ పెరుగుతోంది. సొంతిళ్లకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు’’ అని నౌక కెప్టెన్ ఆశీష్ ఎన్ జా చెప్పారు.

మరిన్ని వార్తలు