ఇస్లామాబాద్: డ్రైవర్ అధిక వేగంతో బస్సును నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్పైకి దూసుకుపోయింది. దాంతో బస్సులోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి బస్సులోని 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్లోని దక్షిణ సూక్కుర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.