మూడు రెట్లు పెరిగినబ్రిటన్ స్కాలర్ షిప్‌లు

11 Jul, 2014 01:40 IST|Sakshi

భారతీయ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యం

లండన్: భారత్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో బ్రిటన్ తన ఉపకారవేతనాల పథకాన్ని మరింత విస్తరించింది. చీవెనింగ్ స్కాలర్‌షిప్‌ల పథకంపేరిట విద్యార్థులకు అందించే ఫెలోషిప్‌లను మూడురెట్లకు పైగా, 150కి పెంచారు. 2015- 16 సంవత్సరంనుంచి కేటాయింపును 24 లక్షల పౌండ్లకు (రూ. 24.68 కోట్లకు) పెంచారు. ప్రస్తుతం అమలులో ఉన్న 6 లక్షల పౌండ్లనుంచి (రూ. 6.18 కోట్లనుంచి) పెంచిన ఈ స్కాలర్‌షిప్‌లను  రెండేళ్లపాటు అమలు చేస్తారు.
 
నాయకత్వ సామర్థ్యం ఉన్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకునేందుకు స్కాలర్‌షిప్‌ల హెచ్చింపు మరింత ప్రోత్సాహకరం కాగలదని బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్ వ్యవహారాల మంత్రి హ్యూగో స్వైర్ చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో అందించే ఈ స్కాలర్ షిప్‌ల పథకానికి బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్ వ్యవహారాల కార్యాలయం నిధులందిస్తుంది. ఏడాది వ్యవధితో కూడిన మాస్టర్స్ డిగ్రీ కోర్సుకు ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు మినహా 110కిపైగా దేశాల విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.

మరిన్ని వార్తలు