ఉగ్రదాడుల్లో 30 మంది మృతి

7 Jul, 2016 03:53 IST|Sakshi

యెమెన్, అఫ్గాన్, సిరియాల్లో దాడులు
 
 సనా/కాబూల్/డమాస్కస్/బాగ్దాద్ : ఈద్-ఉల్-ఫితర్ సంబరాలు చేసుకుంటున్న సమయంలో వివిధ దేశాల్లో ఉగ్రవాదులు దాడులు చేశారు.  యెమెన్, అఫ్గానిస్తాన్, సిరియాలో బాంబులు పేల్చి ప్రాణాలు తీశారు. యెమెన్‌లో ఉగ్రవాదులు బుధవారం కారుబాంబుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 10 మంది మరణించారు. ఏడెన్ విమానాశ్రయం పక్కనున్న మిలిటరీ స్థావరం లక్ష్యంగా ముష్కరులు దాడి చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన ఉగ్రవాదులు సైనికులతో ఘర్షణలకు దిగారు.

మరోపక్క.. అఫ్గాన్‌లోని సారిసాల్‌లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఒక గిరిజన నేత బంధువులు నలుగురు మరణించారు.సిరియాలోని అల్-హసకా ప్రావిన్సులో మంగళవారం ఒక బేకరీ పక్కన మోటార్ సైకిలు పేలడంతో 16 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఐసిస్ జరిపిన ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య 250కి చేరింది.

 భారత్‌లో ఇస్లాం మత ప్రబోధకుడిపై చర్యలకు అవకాశం
 న్యూఢిల్లీ: ఇతర మతాలపై ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న ఇస్లాం మతప్రబోధకుడు జకీర్ నాయక్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  ఢాకా రెస్టారెంట్‌లో దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకరు  నాయక్ ప్రసంగాలు విని ఉగ్రవాదం వైపు ఆకర్షితుడ య్యాడు. జకీర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామనీ, అయితే ఏం చర్యలు తీసుకుంటామో ఒక మంత్రిగా తాను చెప్పలేనని హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ముంబైలో జకీర్ ఓ ఇస్లాం పరిశోధన సంస్థ  స్థాపించాడు. దీన్ని యూకే, కెనడాల్లో నిషేధించారు.

>
మరిన్ని వార్తలు