బీజింగ్ : ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రతాపం చూపుతున్న మహ్మమారి కరోనా వైరస్ను నియంత్రించడంలో చైనా కొంతమేర విజయం సాధించిన విషయం తెలిసిందే. వైరస్ పురుడుపోసుకున్న చైనాలోని వుహాన్ నగరంలో గడిచిన కొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదంటూ అక్కడి మీడియా పలు కథనాలను వెలవరించింది. ఈ నేపథ్యంలోనే చైనాలోని దక్షిణ ప్రాంతంలో తాజాగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు ప్రకటించారు. శనివారం నమోదైన 30 కేసుల్లో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని, ఐదుగురు మాత్రం స్థానికులేనని తెలిపారు. (భారత్ సహాయాన్ని కోరిన ట్రంప్)
అలాగే కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 62 మందిని గుర్తించామని వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. గతకొన్నిరోజులుగా స్తబ్దంగా ఉన్న వైరస్ మరోసారి వెలుగుచూడటం ఆదేశ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిస్తోంది. కాగా ఇప్పటి వరకే చైనాలో 81,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,329కి చేరింది. మరోవైపు కరోనా అనుమానితులను ముందుగానే గుర్తించి.. నిర్బంధంలోకి పంపుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్పై పోరుకు చైనా తొలి 50 రోజుల్లోనే అనేక కఠిన చర్యలను అమలు చేసిన విషయం తెలిసిందే.