విమానప్రమాద బాధితులకు భారీ పరిహారం

28 Mar, 2015 15:10 IST|Sakshi

ఆల్ప్స్ పర్వతాల్లో విమానం కూలిపోయి మరణించిన 149 (కో పైలట్ లూబిడ్జ్‌ని మినహాయించి) మంది బాధితుల కుటుంబాలకు లుఫ్తాన్సా విమానయాన సంస్థ నష్ట పరిహారం కింద కోట్లాది రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. తక్షణ సహాయం కింద శుక్రవారం రాత్రి ఒక్కో ప్రయాణికుడికి రూ. 34 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. 1999 నాటి మాంట్‌రీల్ అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఒక్కో బాధితుడికి రూ. 98 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. తమ కుటుంబానికి భారీ నష్టం జరిగినట్టు బాధితుల కుటుంబాలు కోర్టులో రుజువు చేస్తే ఈ నష్ట పరిహారం మరింత పెరుగుతుంది. థర్ట్ పార్టీ కారణంగా విమాన ప్రమాదం జరిగినట్లు లుఫ్తాన్సా రుజువు చేయగలిగితే తాము చెల్లించాల్సిన నష్ట పరిహారం భారీగా తగ్గుతుంది.

అయితే ఈ విమాన ప్రమాద సంఘటలో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే కో పైలట్ ప్రమాదానికి బాధ్యుడని ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయి కనుక. విమానయాన నిబంధనల ప్రకారం పైలట్ల మానసిక పరిస్థితిని సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి. అందుకు అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తుండాలి. అంతేకాదు... విమానం నడిపేముందు ప్రతిసారీ పైలట్ ఫిట్‌నెస్‌ను తెలుసుకోవాలి. ఈ విషయంలో లుఫ్తాన్సా పూర్తిగా విఫలమైనందున ఇందుకు కోర్టులు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు