సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం; 35 మంది మృతి

17 Oct, 2019 14:32 IST|Sakshi

దుబాయ్‌ : సౌదీ అరేబియాలోని మదీనాలో బుధవారం అర్ధరాత్రి రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35 మంది విదేశీయులు మృతి చెందినట్లు సౌదీ అరేబియా వార్తాసంస్థ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. 40 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు మదీనా ఫ్రావిన్స్‌లోని అల్‌ అఖర్‌ సెంటర్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న భారీ ప్రొక్లెయినర్‌ను ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న ప్రయాణికల బయటికి వచ్చేందుకు కిటికీ అద్దాలు పగలగొట్టినట్లు స్థానికలు తెలిపారు. అప్పటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో 35 మంది విదేశీయులు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని అల్‌- హమ్నా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్‌, అరబిక్‌కు చెందిన పౌరులు ఉన్నట్లు తెలిసింది. కాగా గతంలోనూ అల్‌ అఖర్‌ ఫ్రావిన్స్‌ దగ్గర పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2018 ఏప్రిల్‌లో మక్కాను సందర్శించుకోవడానికి బస్సులో 20 మంది యాత్రికుల బృందం బయలుదేరింది. సరిగ్గా మదీనాలోని అల్‌ అఖర్‌ ఫ్రావిన్స్‌ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ను గుద్దడంతో నలుగురు బ్రిటీష్‌ పౌరులు మరణించగా, 12 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ముస్లింలకు పవిత్ర స్థలంగా పేరొందిన మక్కాకు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంవడం బాధాకరమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు