అమెరికాలో భారతీయుల హవా

8 Nov, 2019 04:50 IST|Sakshi
సుహాస్‌ సుబ్రమణ్యం, డింపుల్‌ అజ్మీరా, మనోహర్‌ రాజు, గజాలా హష్మీ

వర్జీనియా స్టేట్‌ సెనెట్‌కు గజాలా హష్మీ

ప్రతినిధుల సభకు సుహాస్‌ సుబ్రమణ్యం

వాషింగ్టన్‌: నలుగురు భారతీయ అమెరికన్లు తాజాగా అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు. వారిలో ఒక ముస్లిం మహిళ, మరో వైట్‌ హౌజ్‌ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు. గజాలా హష్మీ వర్జీనియా స్టేట్‌ సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే, ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్‌ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గజాలా హష్మీ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

ప్రస్తుతం రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజ్‌లో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్‌ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్‌ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. 1979తో బెంగళూరుకు చెందిన వైద్యురాలైన తన తల్లితో కలిసి ఆయన అమెరికా వెళ్లారు. మరోవైపు, కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్‌ మనోహర్‌ రాజు శాన్‌ ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్‌ కరొలినాలో చార్లట్‌ సిటీ కౌన్సిల్‌కు డింపుల్‌ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు.
 

మరిన్ని వార్తలు