సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేఖ

19 Dec, 2019 15:59 IST|Sakshi

కొత్త వ్యక్తులతో స్నేహం చేయడానికి కొంతమంది ఆసక్తి చూపుతారు. తమ అభిప్రాయాలు, ఆలోచనలకు దగ్గరగా ఉండేవాళ్లతో పరిచయం చేసుకోడానికి ఉవ్విళ్లురుతారు. అయితే ఇంగ్లండ్‌లోని ఓ నలుగురు స్నేహితులు మాత్రం విచిత్రంగా ఓ జంతువుతో స్నేహం చేయాలని భావించారు. అంతేగాక దానితో స్నేహం కోసం ఓ లేఖ కూడా రాశారు. చివరికి బదులుగా వచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు వాళ్లు దేనితో స్నేహం చేయాలనుకుంటున్నారు.. సమాధానం ఏం వచ్చింది అని ఆలోచిస్తున్నారా.. అయితే చదవండి. 

ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన జాక్‌ మెక్‌క్రాసన్‌, తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఇటీవల ఓ ఇంట్లోకి అద్దెకు దిగారు. వారికి పెంపుడు జంతువులంటే ప్రాణం. కానీ ఇంటి యాజమాని అందుకు అనుమతించకపోవడంతో నిరాశ చెందారు. దీనికి పరిష్కారం అలోచించిన ఆ స్నేహితులు ఎదురింట్లో పెంపుడు కుక్క ఉందని తెలుసుకున్నారు. ఇక తలచిందే తడవుగా మీ కుక్కతో వాకింగ్‌ చేయొచ్చా.. స్నేహం చేయొచ్చా అని పక్కింటి వారికి లేఖ రాశారు. దీనికి ప్రతిస్పందనగా వారికి కుక్క తరఫున మరో లేఖ అందింది. అది చూసిన ఆ నలుగురు ఆనందంలో మునిగితేలారు.  

‘‘అబ్బాయిలూ.. మీరు రాసిన లేఖ అందింది. నాకూ కొత్త వ్యక్తులను కలవడం ఇష్టమే. మీరు నా స్నేహితులవ్వడం గొప్ప విషయంగా భావిస్తున్నా. కానీ ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. మన స్నేహం విలువ రోజుకు ఐదు బంతులు విసిరాలి. నన్ను బుజ్జిగించి ఆడుకోవాలి. ఇది మీకు అంగీకారమైతే నా సేవకుడి (ఇంటి యాజమానురాలి)కి వాట్సాప్‌ చేయండి. త్వరలోనే కలుద్దాం’’ అంటూ ఆ కుక్క భావాలను లెటర్‌ రూపంలో ఇంటి యాజమానురాలు పంపారు. ఈ విషయమంతా సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ  వైరల్‌గా మారింది. ఈ లేఖను చదివిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మా పెంపుడు కుక్కకు స్నేహితులంటే ప్రాణం. మీరు ఎప్పుడైనా రావచ్చు’ అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు