40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

17 Jul, 2019 08:27 IST|Sakshi

దుబాయ్‌: ఎయిరిండియా సంస్థకు చెందిన విమానాల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు 40 కేజీల లగేజీని తమ వెంట తీసుకెళ్లొచ్చు. బ్యాగేజీ పరిమితిని ఎయిరిండియా మరో 10 కేజీలు పెంచడంతో 40 కేజీల వరకు తీసుకెళ్లే వెసులుబాటు కలిగింది. టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి కూడా లగేజీ పరిమితి పెంపు వర్తిస్తుందని ఎయిరిండియా చైర్మన్, సీఎండీ అశ్విని లొహానీ వెల్లడించారు. సాధారణంగా ప్రయాణికుడి వెంట ఉంచుకుని తీసుకెళ్లే 7 కేజీల లగేజీకి అదనంగా 40 కేజీలు విమానంలో తీసుకెళ్లే అవకాశం కలగనుంది. ఇండోర్‌–దుబాయ్, కోలకతా–దుబాయ్‌ విమాన సేవల ప్రారంభం సందర్భంగా దుబాయ్‌లోని ఇండియా క్లబ్‌లో నీలగిరి ట్రేడింగ్‌ కంపెనీ సీఈవో చంద్రశేఖర్‌ భాటియా అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అశ్విని లొహానీ మాట్లాడుతూ.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బ్యాగేజీ పరిమితిని పెంచినట్టు వెల్లడించారు.

ఈ నిర్ణయంపై విమాన ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యాగేజీ పరిమితిని 30 నుంచి  40 కేజీల పెంచడం చాలా సంతోషంగా ఉంది. విమానాశ్రయంలో ప్రతిసారి అధికంగా ఉన్న లగేజీ తీసేస్తుంటే ఎంతో బాధ కలిగేది. సాధారణంగా విదేశాల్లో ఉండేవారు. రెండుమూడేళ్లకు ఒకసారి స్వదేశానికి వస్తుంటారు కాబట్టి వెళ్లేటప్పుడు బ్యాగేజీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. నా వరకు చూస్తే దుబాయ్‌ నుంచి వెళ్లేటప్పుడు ఇక నుంచి ఎక్కువ డ్రైఫ్రూట్స్‌ తీసుకెళ్తాను. వచ్చేటప్పుడు మా అమ్మ చేసిన స్వీట్లు ఈసారి ఎక్కువగా తెచ్చుకుంటాన’ని ముంబైకి చెందిన అతిథి చందన్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు