ఇరాన్‌ను వణికించిన భూకంపాలు

8 Jan, 2020 11:14 IST|Sakshi
బుషెహ్ర్ అణు కర్మాగారం (ఫైల్‌ ఫోటో)

టెహ్రాన్: ఇరాన్‌ సైనికాధికారి ఖాసిం సులేమానీని అమెరికా పొట్టన పెట్టుకున్న అనంతరం ఇరాన్‌ వరుస విషాద ఘటనలతో అల్లాడుతోంది. సులేమాని అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దాదాపు170మంది ప్రయాణీకులతో బయలుదేరిన  ఉ‍క్రెయిన్‌కు చెందిన ప్యాసింజర్‌ విమానం టేక్‌ ఆఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో  సిబ్బంది సహా మొత్తం ప్రయాణికులు మరణించారు.  ఇది ఇలా వుండగానే ఇరాన్‌లోని రెండు ప్రాంతాల్లో  5.5, 4.9 తీవ్రతతో రెండు ఏరియాల్లో భూమి కంపించింది. 

బోరాజ్జన్ బుషేర్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని బుషెహ్ర్ అణు కర్మాగారం సమీపంలో బుధవారం 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదికలు తెలిపాయి.  మరో ఘటనలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇరాన్  ఖోరాసన్-ఇ రజావి ప్రావిన్స్‌లో  మరో  భూకంపం  సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌లో 5.8 గా నమోదైందని  ప్రెస్ టివి నివేదించింది. ఉదయం 7.59 గంటలకు 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హోజ్జతాలి షయాన్ఫార్ తెలిపారు. క్షతగాత్రులు, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేనప్పటీకీ  ఎక్కువ ప్రాంతం ప్రభావితమైందని చెప్పారు. తమ సర్వే బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. సహాయ రక్షణ చర్యలు చేపట్టామని,  బాధిత ప్రాంతంలో రక్షక  బలగాలను మోహరించినట్టు తెలిపారు.

కాగా మిలిటరీ కమాండర్‌ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడిచేసింది.  దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార దాడి తప్పదన్న తరహాలో స్పందించిన  తరువాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. 

చదవండి :  ఇరాన్‌లో కుప్పకూలిన విమానం 

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు 

ఇరాన్‌ దాడి : భగ్గుమన్న చమురు

మరిన్ని వార్తలు